కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించనున్నట్టు జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి ఉన్న గ్రామాల్లో వేల ఎకరాల కొబ్బరి తోటలు ఉప్పు నీరు కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయని ఆయన తెలిపారు.
వైనతేయ పాయ నుంచి సముద్రపు నీరు శంకరగుప్తం డ్రైన్లోకి చేరి, అక్కడి నుంచి తోటల్లోకి వెళ్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఫలితంగా చెట్లు ఎండిపోవడం, పంట నష్టం కలగడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం సహా 13 గ్రామాల రైతులు తీవ్రంగా ప్రభావితమయ్యారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి దసరా తర్వాత కోనసీమ ప్రాంతాన్ని సందర్శిస్తానని ఆయన ప్రకటించారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసం ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు, కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి సమావేశం అవుతానని ఆయన తెలిపారు. రైతుల జీవనోపాధి కాపాడటానికి, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ సూచించారు.



